ఎవరినీ వదలొద్దు..

తూర్పుగోదావరి, ,కాకినాడ సిటీ: నగరాలు, పట్టణాల్లో కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాటిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్, ఎస్పీ, ఆర్డీవో, మున్సిపల్‌ కమిషనర్‌లను ఆదేశించారు. సోమవారం అమరావతి నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి రోజు ప్రతి కుటుంబాన్ని వార్డు స్థాయిలో వలంటీర్లు పరిశీలన చేయాలన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో టీమ్స్‌ బాగా పని చేసేలా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. దీనికి కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు బాధ్యత ఉందన్నారు. గ్రామీణ, అర్బన్‌ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కలెక్టర్లకు వివరించారు. రాజమహేంద్రవరం మున్సిపల్‌ కమిషనర్‌ అభిషిక్త్‌ కిశోర్‌తో మాట్లాడుతూ యువ అధికారుల నుంచి ప్రభుత్వం మరింత సేవలను ఆశిస్తుందన్నారు. దానికి అనుగుణంగా పని చేయాలన్నారు.